ఉత్తమ బ్లాగు పోటీలు - 2009



టపాలు రాసి చాలా రోజులయింది. 2012 సినిమా మీద పేరడీగా రాద్దామని మొదలుపెట్టాను, మద్యలోనే ఆగిపొయింది. పని వత్తిడి కూడా బాగా పెరిగింది, పని ఎక్కువ లేదు కానీ పని చెయ్యాల్సి వస్తుంది. తమాషాగా ఉంది కదా! నేను ఇంకో రెండు వారాల్లో కాలాస్త్రికి వెళ్ళాలి. ఇంకో నాలుగు రోజులు శెలవలు పెట్టాల్సి వచ్చింది. దాని కోసం శని, ఆది వారాల్లో కూడా పని చేస్తున్నా, అదే లేండి! పని చెయ్యాల్సొస్తుంది.


20, 23 తేదీలలో హైదరాబాదులో ఉంటాను. మన ఈ-తెలుగు స్టాలుకి వచ్చి పద్మనాభం దూర్వాసులు గారిని, కత్తి మహేష్ గారిని ఇంకా మిగతా బ్లాగర్లని కలుద్దామనుకుంటున్నాను. ఆ వారం బ్లాగర్ల సమావేశం ఉంటే చెప్పండి, నేను కలుస్తాను. కొత్తపాళీగారు ఒక వారం తరువాత పుస్తకావిష్కరణ చేసేటట్లయితే నేను కూడా ఆ సభలో ఉండేవాడిని.


ఇక అసలు విషయానికి వస్తాను. ఆంధ్రలేఖ వెబ్ సైటు వారు తెలుగు బ్లాగర్లకి ఒక పోటీ పెట్టబోతున్నారు. తెలుగు బ్లాగర్ల కృషిని గుర్తించడానికి చేస్తున్న ఒక మహత్తరమయిన విషయం! మీ బ్లాగు తెలుగు, ఇంగ్లీషులో ఉంటే చాలు, మీరు కూడా పోటీకి అర్హులయినట్లే! ఈ సంవత్సరంలో మీరు రాసిన మంచి టపాని వీరికి పంపండి.అన్ని టపాలని ప్రముఖ జర్నలిస్టులు చదివి ఉత్తమ బ్లాగులని జనవరి 15 లోగా ఎన్నుకుంటారు. మొడటి 3 ఉత్తమ బ్లాగులకి షీల్డ్స్ మరియు ఆకర్షణీయమయిన బహుమతులు ఇవ్వబడుతుంది. మీ పేరు, ఊరు, బ్లాగు వివరాలతో ఆంధ్రలేఖకి లేఖ పంపండి. మరిన్ని సమాచారం కోసం ఇక్కడ నొక్కండి. ఈ పోటీల ద్వారా బ్లాగర్ల ఉనికి మిగతా ప్రపంచానికి ఇంకొంచెం ఎక్కువ తెలియడానికి ఉపయోగపడుతుంది. ఈ మంచి అవకాశాన్ని తెలుగు బ్లాగర్లకి కల్పించినందుకు ఆంధ్రలేఖకి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

కాలాస్త్రి కబుర్లు - నవంబరు 2

సానా దినాల నుంచీ రాద్దామనుకుంటా ఉండా,ఖాళీ లేక రాయలేక పోతా ఉండా. ఈ రోజు కొంచెం నెమ్మళం గుండా, ఇంక సూస్కో ఇరగ రాసేస్తా.



అసలు లేటు ఎందుకంటే మా ఆవిడ ఊర్లో ల్యా. ఇంటి పనంతా నాదే, గిన్నెలు తోమడం, వంట వండడం, గుడ్డలు పిండడం అబ్బ..ఎన్ని పనులుండ్యాయి నాయనా! సచ్చి పోతా ఉండా. అంతే కాదు, నాలుగు దినాల ముందు నా జ్ఞాన దంతం గూడా పీకారు. 2 దినాల వరకు కొంచెం నొప్పి ఉండేది, ఇపుడు బాగనే ఉండాది. పోయిన వారం మా ఊరిలో దీపావళి పండగ జరిగింది, మన కొత్తపాళీ గారు ఇందాకే టపా లో బెట్టారు. అబ్బా..పిలకాయలు తుక్కు లేపారు. 2,3 సమ్మస్సరాల పిలకాయలు కూడా ఏమి డాన్సు సేసారబ్బా? మన కొత్తపాళీ గారయితే నరకాసురుడిగా తుక్కు లేపిండ్లా! నేను, గణేష్ కూడా సిన్న ఏశం ఏసాం.



మా ఊరిలో సాయిబాబా గుడికి సాయిబాబా విగ్రహం వచ్చింది. 4 దినాల నుండీ రోజూ అభిషేకాలు, హోమాలు, మహా ప్రసాదాలతో భక్తి రసం పారింది. మా వాలంటీర్లకి బాబాకి అభిషేకం చేసే అవకాశం ఇచ్చారు. యాడాడనుండో పూజారులు వచ్చి పూజలు చేసారు. ఉదయం నుండి అర్థరాత్రి వరకు చాలా సందడిగా జరిగింది. ఉదయం నుండి రాత్రి వరకు నిలబడుకుని ఉండి నేను 3 ఇంచిలు భూమిలోకి దిగబడిన్యా. ఆదివారం సంతకెళ్ళి 4 ఇంచిలు చెప్పులు కొనేసరికి చెల్లుకి చెల్లు అయిపోయింది. నేను కొంచెం భూమికి దగ్గరగా ఉంటాను కాబట్టి మిగిలిన ఒక ఇంచె కలిసొచ్చింది.



నిన్న మజ్జానం ఏక్ నిరంజన్ సినిమా కి పొయిన్యా. పరవాల్యా సినిమా, పాటలు బాగనే ఉండాయి. రెండో బెల్లు తర్వాత బాంకాక్ పోయి కంపు,కంపు అయింది. పూరీ పెద్దమ్మ బాంకాక్ లో ఉండాదో, ఏందో? ప్రతి సినిమాకి ఆడకి తీసకపోతా ఉంటాడు.సినిమా లో కామెడీ బాగుంది. పూరీ సినిమాలో ఉండేవాళ్ళంతా ఉండారు. అందరికీ పోకిరి సినిమాలో ఉండే జుట్టే ఉంది, అప్పటి నుంచీ ట్రిం చేసుకుంటా ఉండారు లాగుంది. కంగనా కి కూడా ఇదే బాచి జుట్టు. ఆ జుట్టు చూసే సినిమా లోకి తీసుకున్నాడా యేంది? ఆమె తినేదంతా జుట్టుకే పోతా ఉండాది లాగుంది, ఇంక్యాడా పెద్ద కండ లేదు. మకరంద్ దేష్ పాండే చేత ఫిలాసఫీ చెప్పించారు. ఇతను కూడా జుట్టు పోళి బాచ్చే! పోసాని డైలాగులు బాగుండాయి. సోనూ సూద్ కామెడీ కూడా బాగనే ఉంది కానీ లోకల్ టాలెంట్ తీసుకుంటే బాగుండేది. బాబాయ్ టాలెంట్ అంతా సిక్స్ పాక్,తెల్ల తోలు తప్పితే పెద్ద సీన్ లేదు.అదే డబ్బింగ్ విని, విని బోరు కొడుతుంది. హీరోయిన్ విషయంలో కూడా ఇంతే! చార్మీని చూసి అయినా తెలుగు నేర్చుకుంటే నేను సంతోషిస్తాను.



వైయెస్ సచ్చిపోయినాక సోనియా (ఈమెకి మళ్ళీ గాంధీ ఎందుకు యెనకాల) పెద్ద పార్టీ సేసుకుని ఉంటాదేమో? కాంగెస్ పార్టీ సరిత్ర తెలిసినోళ్ళందరికీ ఈ పార్టీ అజెండా పెద్దగా చెప్పక్కలేదనుకుంటా. వైయెస్, జగన్ గ్రూపుని తొక్కుడు బిళ్ళ ఆట ఆడుకుంటుంది. సందట్లో సడేమియా అంటూ యాడాడో దుప్పటేసుకుని పడుకున్న కేశవరావు, జానా రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, మధు యాష్కీ లాంటోళ్ళంతా మంచం దిగి బయటకొచ్చారు. రోశయ్య ఇంక 3 సంవస్సరాలు పండగ చేసుకుంటాడు. కొండా సురేఖ గలభా మొదటికే మోసం అయింది. బాబుకి హోం వర్కు పెరిగింది, రోశయ్య తర్వాత బాబుకే చాన్సు దొరకాలి లెక్క ప్రకారం. బాబుకి టముకు ఏసుకోవడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికలకి కాంగ్రెస్ ప్రజారాజ్యంతో కలుస్తుందన్న రూమర్ ఇపుడు బాగా వేడిగా ఉంది. ఇదే నిజమయితే చిరంజీవి రాజకేయ వేత్తగా ఒక మెట్టు ఎదిగినట్టే! మడిసిగా మూడు మెట్లు దిగినట్టే!



నిన్న రాత్రి మా టీవీలో చాలెంజ్ ప్రోగ్రాం చూసా కాసేపు.ఎలిమినేషన్ రౌండులో పార్టిసిపెంట్స్ ఎవర్ని ఎలిమినేట్ చేయాలో పేర్లు రాస్తున్నారు. ఎవడయితే ట్రోఫీ గెలుచుకోవడానికి అడ్డం అనిపిస్తే వాడి పేరు రాస్తున్నారు.టాలెంట్ బాగా ఉండేవాళ్ళు ఇంటికి వెళ్తే మిగతా వాళ్ళని తొక్కడం వీజీ కదా! ఇక్కడ కూడా బాబు ఇదే విషయం మీద పండగ చేసుకుంటున్నాడు. వైయెస్ తొక్కడం కష్టమేమో కానీ రోశయ్యని మాత్రం ఎడం కాలితో తొక్కేయచ్చు. ఇంకో విషయం వైయెస్ 2004 లో సీయెం అయ్యేముందు ఆస్తులు లక్షల్లోనే! ఇపుడు కొన్ని వేల కోట్లు, ఈ యాపారం యేదో బాగనే ఉంది.



సివరాకరిగా ఇంకో విషయం! ఈనాడు ఇపుడు సెల్ ఫోనులో సదువుకోవచ్చు. నల్ల పండులో ఇందాకే డవున్ లోడ్ చేసాను. కొంచెం నావిగేషన్ కష్టంగా ఉంది.నల్ల పండు బ్రౌజర్ అంత బాగుండదు కాబట్టి ఇంతకు ముందే ఉన్న ఒపెల్ మిని బ్రౌజర్ లో చాలా సుఖంగా చదువుకోవచ్చు. మీకు యాపిల్ పండు, ల్యాకపోతే ఇంకేదన్నా పండు ఉంటే ఉంటే ట్రై చేసుకోండి.


మహాత్మ - కాలాస్త్రి పరిశీలన




రెండు రోజుల ముందు నా 100వ టపాని రాద్దామని మొదలుపెట్టా.రెండు లైన్లు రాసాక ఆ టపాకి ఇపుడు సందర్భం కాదనిపించింది. ఇపుడు మార్కెట్లో ఉన్న గణేష్,మహాత్మా సినిమాల గురించి రాద్దామనుకుంటే వాటి గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. వాటికి అంత చిత్రం (సీన్) లేదేమో అని వదిలేసాను. నిన్న మహాత్మా సినిమా చూసాక మంచి ఫీలింగ్ కలిగింది. ఇది 100వ టపాకి ఇంచుమించు సరిసాటి అని అమోదించేసా. ఇపుడే కూడలిలో చూస్తే పరిమళం గారి 100వ టపా కనిపించింది. మహాత్మ శ్రీకాంత్ కి 100వ సినిమా కావడం ఇంకొక విశేషం! ఇక విశేషాలు పక్కన పెట్టి సినిమా గురించి మాట్లాడుకుందాం.




శ్రీకాంత్ ఇప్పటివరకు చేసిన సినిమాల వల్ల అతని కంటే అతని పక్కన వాళ్ళకి బాగా పేరు వస్తూ ఉండింది. రొటీన్ గా చేస్తూ ఉంటాడు, రొటీన్ గా సినిమాలు ఆడుతూ ఉండేవి. కొన్ని సంవత్సరాల క్రితం ఆపరేషన్ ధుర్యోధన లో కొంచెం కొత్తగా బాగా చేసాడు. "అబ్బో...ఫరవాలేదే! శ్రీకాంత్ కూడా బాగనే చేసాడు" అనుకున్నా. ఈ సినిమాలో అతని పరిథి దాటి ఇంకొంచెం బాగా చేసాడు. సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా బాగనే సాగింది. అందరిలాగే ఇతను కూడా సన్నబడి కొత్త లుక్ లో కనిపించాడు. ఇలా చిక్కి సగమయిన వాళ్ళందరి నెగటివ్ పాయింటు శ్రీకాంత్ కి పాజిటివ్ పాయింటయ్యింది. అది ఎలాగంటే జూ.ఎంటీయార్ సన్నబడి గ్లామర్ ఇంతకు ముందు కంటే తగ్గింది. నయనతార,ప్రభాస్ కి కూడా ఇదే పరిస్థితి. శ్రీకాంత్ కి కూడా అలాగే జరిగింది. సాఫ్ట్ గా ఉండే శ్రీకాంత్ ముఖం ఇపుడు కళ తగ్గి ముదురుగా అయింది. ఈ పాత్రకి అది సరిగ్గా సరిపోయింది.




స్క్రీన్ నిండా మనుషుల్ని పెట్టి గోల గోలగా సినిమాలు తీసే కృష్ణవంశీ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఒక మంచి విషయమేమిటంటే టైంపాస్ అయితే అయిపొతుంది. ఇతని సినిమాల్లో పాటలు బాగా తీస్తాడు. సినిమా చివర కొచ్చేసరికి కొంచెం సాగదీసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాకి మాత్రం కథ చాలా పకడ్బందీగా రాసాడు. పరుచూరి డైలాగ్స్ సినిమాకి బాగా హెల్ప్ చేసాయి. ఎవరినీ వదిలి పెట్టకుండా అందరికీ వాతలు పెట్టారు. సినీ ఇండస్ట్రీలో వారసత్వం, పార్టీ కొక పేపర్,టీవీ చానెళ్ళు,రాజకీయ వారసత్వం, సామాజిక వర్గం మీదా చెణుకులు దీపావళి టపాకాయల్లాగా బాగా పేలాయి. సినిమా క్లైమాక్స్ కూడా రొటీన్ గా కాకుండా కథలో ట్విస్ట్ పెట్టి బాగా తీసాడు.




హైటెక్ సిటీ సెట్ బాగా ఉంది. జయప్రకాష్ రెడ్డికి మంచి పాత్రే లభించింది. దొరికిన పాత్రకి అతను బాగనే న్యాయం చేసాడు. ఈ సినిమాలో ఇంకొక పాత్ర గురించి చెప్పుకోవాలి, అది ఎవరంటే "రాం జగన్". సినిమా అంతా ప్రముఖ తెలుగు నాయకుల వేషాలు వేసుకుని కథని నడిపించడంలో బాగా సాయపడతాడు. టైటిల్స్ లో కూడా తెలుగు ప్రముఖుల గురించి ప్రస్తావించడం ముచ్చటగా ఉంది. హీరోయిన్ గా సాదా దోస లాగుండే భావనని ఎందుకు తీసుకున్నారని అనిపించింది మొదట్లో. కొంచెం ఆక్టింగ్ చెయ్యాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈమెని తీసుకోవల్సి వచ్చిందని తరువాత తెలిసింది. చాలా మంది రివ్యూస్ లో భావన గురించి నెగటివ్ గా రాసారు, దీన్ని నేను విపరీతంగా ఖండిస్తున్నాను. ఈమెని ఇంతకు ముందు యాడ చూసానబ్బా? అని వెతికితే ఒంటరి సినిమాలో గోపీచంద్ తో పాటూ నటించిందని తెలిసింది. ఈ సినిమా చూసానో, లేదో నాకు గుర్తు రావడం లేదు. సినిమా రివ్యూ చదివినా ప్రస్తుతం గుర్తుకు రావడం లేదు. ఉత్తేజ్ కూడా ఫరవాలేదనిపించాడు.




నేను వెళ్ళేసరికి సినిమా కొంచెం మొదలయి టైటిల్స్ పడుతూ ఉన్నాయి. ఆ పాట లో తెలుగు ప్రముఖులని గుర్తు చేసుకోవడం బాగుంది. "కొంత మంది ఇంటి పేరు కాదురా గాంధి" పాట మనల్ని అలోచింపచేస్తుంది. కృష్ణవంశీ సినిమాలకి సిరివెన్నెల మంచి పాటలు రాస్తాడు. ఇంతకు ముందు చక్రం సినిమాలో "జగమంత కుటుంబం నాది" అని అద్భుతమయిన పాట రాసాడు. ఆ పాట రాసిన తరువాత సినిమా మొదలుపెట్టానని కృష్ణవంశీ చెప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఈ సినిమా కూడా "కొంతమంది ఇంటిపేరు కాదురా గాంధి" పాట చేతికి వచ్చినపుడు కథ మొదలుపెట్టాడేమో? ఈ సినిమా ఆడియోని గాంధి మనవడు తుషార్ గాంధి ఆవిష్కరించడం గమనార్హం. పై ఫోటోలో గాంధి విగ్రహం పక్కన శ్రీకాంత్ తో తుషార్ గాంధిని చూడగలరు. గాంధీ గారి ఆశయాలని గుర్తు చేయడానికి తీసిన ఈ సినిమాని తప్పక చూడండి.




ఇప్పటివరకు నా టపాలని చదివి నన్ను ప్రోత్సహించి కామెంట్లతో దీవించిన మీకందరికీ నా వందనములు. టపా రాయగానే చదువుతూ ఉండే మిత్రులు విష్ణు కోటమరెడ్డి, చంద్ర శేఖర్ గ్రంధి, రాం ప్రసాద్ పిళ్ళారిశెట్టి, అనిల్ కూరపాటి, సుబ్బారావు కొత్తమసు, "బాగా రాస్తున్నారు " అంటున్న మూర్తి బొబ్బిలి, తెలుగు చదలేకపోయినా ప్రయత్నించే జయరాజు కృస్ణం రాజు, వెంకట ప్రసాద్, జగన్ రెడ్డి, చెన్నై నుండి చదివే ప్రత్యేక మిత్రుడు దంపేటి కళ్యాణ్, సూళ్ళూరుపేట నుండి చదివే పెమ్మారెడ్డి త్రిలోక్ చంద్రారెడ్డి, "ఈ మధ్య చాలా పెద్దవిగా రాస్తున్నారండీ" అనే సత్య తిరుమలశెట్టి, శ్రీనివాస్ బోధనపాటి, రెడ్డివారి రమణ, కుమార్, "శీనూ, ఏమిటి నువ్వు రాసావా ఇదంతా?" అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచిన కదిరి ప్రసాద్, అల్లాబక్ష్ కి నా బ్లాగుని ప్రోత్సహిస్తున్న తోటి బ్లాగరు "గాలి బాబు" గణేష్ కి నా వందనములు. నా ప్రతి టపా చదివి ప్రోత్సహిస్తున్న పెద్ద బావకి, చిన్న బావకి వందనములు. రాసిన ప్రతి సారీ నా టపా గురించి వినే పూలబ్బాయిలకి వందనం! వంద టపాల నా ప్రయాణంలో నాకు సహకరించి, ప్రోత్సహించిన బ్లాగర్లు కొత్తపాళీ గారికి, సాదు డ్రీంస్ బ్లాగరు ప్రసాద్ గారికి నా ప్రత్యేక వందనములు.



డెట్రాయిట్ లో శ్రీశ్రీ,కొడవటిగంటి,గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు






శ్రీశ్రీ,కొడవటిగంటి,గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు డెట్రాయిట్ లిటరరీ క్లబ్ ఆధ్వర్యంలో డెట్రాయిట్ లోని సెయింట్ తోమా చర్చిలో గడచిన వారాంతం జరిగాయి.సభకి విచ్చేసిన సాహితీ అభిమానులని ఉద్దేశించి డెట్రాయిట్ లిటరరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీ మద్దిపాటి కృష్ణారావు గారు ముందు మాటతో స్వాగతం పలుకుతూ కార్యక్రమాలని ప్రారంభించారు. కొకు,శ్రీశ్రీ,గోపీచంద్ ల జీవిత విశేషాలను వివరించడానికి ఉపన్యాసకులయిన కొడవటిగంటి రోహిణీప్రసాద్,వేల్చేరు నారాయణరావు,త్రిపురనేని సాయిచంద్ గారిని సమన్వయకర్తగా వ్యవహరించిన వేములపల్లి రాఘవేంద్రచౌదరి ఆహ్వానించారు.




కొడవటిగంటి కుటుంబరావు కొడుకు కొడవటిగంటి రోహిణీప్రసాద్ తన తండ్రి జీవిత విశేషాలను సభతో పంచుకున్నారు. తమ ఇంటి పేరు ఎలా రావడం,తండ్రికి ఎంతో ఇష్టమయిన ఫొటోగ్రఫీ,గ్రాంఫోను,పుస్తకాల గురించి మాట్లాడారు. ఆ రోజుల్లోనే దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆద్వర్యంలో రిజిష్టర్ మ్యారేజి చేసుకోవడం, దీనికి సాక్షులుగా శ్రీశ్రీ, దర్శి చెంచయ్య, మాధవపెద్ది గోఖలే సంతకాలు చేయడం గురించి గుర్తు చేసారు. కొకు గారికి సంగీతంలో ప్రవేశం గురించి రంగుల రాట్నం సినిమా మ్యూజిక్ రికార్డింగ్ లో జరిగిన సంఘటన వివరించారు.




వేల్చేరు నారాయణరావు శ్రీశ్రీ గురించి మాట్లాడుతూ తన కాలేజీ చదివే రోజుల్లో శ్రీశ్రీ కవితలు జేబులో పెట్టుకు తిరగడం గుర్తుచేసుకున్నారు.కవులలో వ్యక్తిత్వం,జనాల్లో ఆకర్షణ ఉన్న వ్యక్తి శ్రీశ్రీ అని అన్నారు.ఏలూరులో అభ్యుదయవాదులు జరిపిన శాంతిమహాసభలలో తొలి సారిగా శ్రీశ్రీ ని చూడడం జరిగిందని చెప్పారు. శ్రీశ్రీ రచనల్లో సంఘర్షణలు,వైవిధ్యాలు చాలా కనిపిస్తాయన్నారు. శ్రీశ్రీ వ్యకిత జీవితం,అలవాట్లు,స్నేహాలు గురించి మాట్లాడారు. తనను బాగా ప్రభావితం చేసినవారిగా శ్రీశ్రీ ఎప్పటికీ గుర్తు ఉంటారు అని వేల్చేరు గారు తమ ప్రసంగాన్ని ముగించారు.



తన తండ్రి త్రిపురనేని గోపీచంద్ జీవిత విశేషాలను సినీనటుడు సాయిచంద్ సభతో పంచుకున్నారు. రైతుబిడ్డ, మాయాలోకం, లక్ష్మమ్మ సినిమాలలో గొపీచంద్ పనిచేయడం గురించి వివరించారు. గోపీచంద్ రాసిన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా నవలని తను టెలీఫిల్ముగా తయారుచేయడం,కేశవమూర్తిగా తను నటించడం గురించి వివరించారు.




మధ్యాహ్నం పసందయిన విందు భోజన విరామం తరువాత కొడవటిగంటి సాహిత్య వేదికని గోపరాజు లక్ష్మి ప్రారంభిస్తూ వేదిక మీదకి విష్ణుభొట్ల లక్ష్మన్న,చుక్కా శ్రీనివాస్,కందాళ రమానాథ్,కొడవళ్ళ హనుమంతరావు,మంగాపురం విష్ణుప్రియని ఆహ్వానించారు.




విష్ణుభొట్ల లక్ష్మన్న మాట్లాడుతూ కొకు సాహిత్యంతో ఇపుడు ఎందుకు గుర్తు చేసుకుంటున్నామో వివరించారు.తనకు 11 ఏళ్ళ వయసులో చదివిన చందమామ పత్రికలోని బేతాళకథని గుర్తు చేసుకున్నారు. ఆ కథలోని నీతి "స్వయంకృషిలోని తృప్తి" తనకి ఇంకా గుర్తు ఉండడం,ఆ నీతి తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపిందో చెప్పారు. కొత్తజీవితం కథ గురించి మాట్లాడారు. ఇదినిజంగా జరిగిన కథ అని రొహిణీప్రసాద్ గారు అందరికీ తెలియజేసారు.
కొకు రచనల్లో స్త్రీల సాధికారత గురించి గోపరాజు లక్ష్మి మాట్లాడుతూఆల చిన్నతనపు పెళ్ళి,పచ్చకాగితం,సాహసి కథలని గుర్తు చేసుకున్నారు.తరువాత కందాళ రమానాథ్ కొకు రచనల్లో హాస్య వ్యంగ్యాల మేళవింపు గురించి మాట్లాడారు. కొకు కథల్లో భార్యభర్తల సంభాషణలు ఎలా ఉండేవో వివరించి అందరినీ నవ్వించారు.వాస్తవిక కథలకి అవాస్తవిక చిత్రీకరణగా సినిమా అని సినిమా కథలో వివరించారని చెప్పారు. ఐశ్వర్యం నవలపై కొడవళ్ళ హనుమంతరావు ఒక పరిశీలన చేసారు. నవలలోని డాక్టరు పాత్ర గురించి కాసేపు ముచ్చటించారు.మంగాపురం విష్ణుప్రియ "వివాహ వ్యవస్థకు కొకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేసారా?" అన్న విషయంపై మాట్లాడారు. ఈ సందర్భంగా స్వార్థబుద్ది,పెళ్ళి వ్యవహారం,చెడిపోయిన మనిషి కథలు గుర్తు చేసుకున్నారు.



సాయంత్రం 4 పైన శ్రీశ్రీ సాహిత్య వేదికని ప్రారంభిస్తూ వెంకటయోగి నారాయణస్వామి "శ్రీశ్రీ సమకాలీన ప్రాసంగికత" గురించి మాట్లాడారు. చిన్నప్పటి నుండి శ్రీశ్రీ కవితలు తనను ఎలా ప్రభావితం చేసిందో వివరించారు. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి విన్నకోట రవిశంకర్ ప్రసంగించారు.జే.కే.మోహన్ రావు శ్రీశ్రీ కవితల్లో మాతా చందస్సు గురించి మాట్లాడారు. శ్రీశ్రీ మహా ప్రషానం:కదనం, కథనం గురించి తమ్మినేని భూషణ్ వీడియోని సభలో ప్రదర్శించారు. "దూరం నించి శ్రీశ్రీ" అన్న విషయంపై వేల్చేరు నారయణరావు కాసేపు ముచ్చటించారు."ఉద్యమాలు లేకున్నా కవిత్వం ఉంటుంది,శ్రీశ్రీ ఉంటాడు" అన్న హెచ్చార్కే సందేశాన్ని బసాబత్తిన శ్రీనివాసులు సభకి చదివి వినిపించారు.రాత్రి 7.30 కి విందు,వినోదం,గోపీచంద్,కథాసాగర్ పుస్తకావిష్కరణలతో శనివారం ముగిసింది.
ఆదివారం ఉదయం ఉపాహారం తరువాత గోపీచంద్ సాహిత్యవేదికని ఆవుల మంజులత ప్రారంభించారు. వేదిక పైకి ఏపూరి భక్తవత్సలం,కొత్త ఝాన్సీలక్ష్మి,వేములపల్లి రాఘవేంద్ర చౌదరి,మద్దిపాటి కృష్ణారావు,ఆరి సీతారామయ్యని ఆహ్వానించారు. గోపీచంద్ తాత్విక దృష్టి గురించి ఏపూరి భక్తవత్సలం మాట్లాడారు.ఆవుల మంజులత మాట్లాడుతూ తన తండ్రి ఆవుల సాంబశివరావు,గోపీచంద్ స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ప్రత్యేకత,తాత్వికత గురించి కొత్త ఝాన్సీలక్ష్మి మాట్లాడారు. కేశవమూర్తి, ప్రమేశ్వర శాస్త్రి,సుజాత,సుభాషిణి పాత్రలను విశ్లేషించారు.ఈ నవలని ఒక నెల ముందే డెట్రాయిట్ లిటరరీ క్లబ్ లో సమీక్షించడం గమనార్హం. ఆరి సీతారామయ్య మాట్లాడుతూ గోపీచంద్ కి జీవపరిణామక్రియ అర్ధం కాలేదేమోనని అభిప్రాయపడ్డారు.అది నిజంగా అసమర్థుని జీవయాత్రేనా? అని మాచవరం మాధవ్ వీడియోని సభ తిలకించింది.మద్దిపాటి కృష్ణారావు కూడా అసమర్థుని జీవయాత్ర నవలపై తన అభిప్రాయాలని వెలిబుచ్చారు.చీకటి గదులు నవలని వేములపల్లి రాఘవేంద్ర చౌదరి సమీక్షించారు.




మధ్యాహ్న భోజన విరామం తరువాత శ్రీశ్రీ,కొకు,గోపీచంద్ సాహిత్యం,సమాజం - పరస్పర ప్రబావం మీద చర్చ జరిగింది. ఈ చర్చకి సమన్వయకర్త రవి గుల్లపల్లి వేదికపైకి వెంకటయోగి నారాయణ స్వామి,మంగాపురం విష్ణుప్రియ,వేల్చేరు నారాయణరావు,జంపాల చౌదరిని ఆహ్వానించారు. వేడి వేడి ప్రశ్నలు,సమాధానాలతో చర్చా వేదిక ముగిసింది.

డెట్రాయిట్లో శతజయంతి ఉత్సవాలు

కొడవగంటి కుటుంబరావు,శ్రీ శ్రీ,త్రిపురనేని గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు డెట్రాయిట్ లిటరరీ క్లబ్ ఆధ్వర్యంలో సెప్టెంబరు 26, 27 తేదీలలో ఫార్మింటన్ హిల్స్ లొని సెయింట్ తోమా చర్చ్ లో జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తమ కథ,నవల,కవిత్వం మొదలయిన అన్ని సాహిత్య ప్రక్రియలతోను 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా ప్రభావితం చేసిన ఈ ముగ్గురు రచయితల విశిష్టతను తెలిపే ఉపన్యాసాలు,చర్చలు,వినోద కార్యక్రమాలు,విందు భోజనాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొడవగంటి రోహిణీప్రసాద్,శ్రీరంగం వెంకటరమణ,త్రిపురనేని సాయిచంద్ రానున్నారు.

మరిన్ని వివరాలకు http://www.detroittelugu.org/DTLC/main.asp చూడండి.

డిజిటల్ సినిమాలు

2,3 సంవత్సరాల క్రిందట మేము ఒక తొట్టి థియేటర్ నడుపుతున్న రోజులవి. అదే కాంప్లెక్సులో ఇంకొక రెండు చిన్న థియేటర్లు ఉండేవి. చిన్న హాలుకి మంచి డీటీఎస్,డాల్బీ సౌండ్ ఉండేది.పెద్ద హాలులో సోనీ సౌండ్ మాత్రమే ఉండేది. అప్పట్లో మా ఊరులో తెలుగు సినిమాలు డీటీఎస్ లో ఆడేవి కావు. కొత్తగా ఉంటుందని చిన్న థియేటర్ లోని ఆడియో సిస్టం ని పెద్ద థియేటర్ కి మార్పించడానికి ఒక టెక్నీషియన్ ని పిలిపించాం. ఇతను మా ఊర్లో ఉన్న అన్ని సినిమా హాళ్ళకీ డీటీఎస్ బాక్సులు రిపేర్ చేస్తూ ఉంటాడు.


ఒక రోజంతా కష్టపడి డీటీఎస్ బాక్సుని మార్చి పెద్ద సినిమా హాలుని రెడీ చేసాడు. అతనితో కాసేపు ముచ్చటిస్తుండగా డిజిటల్ సినిమాల గురించి చెప్పాడు. డిజిటల్ ప్రొజెక్షన్ ద్వారా డీవీడీ లాంటి డిస్కులతో సినిమాలు వేయడం, డైరెక్టు ఇంటర్నెట్ నుండి సినిమా డౌన్లోడ్ చేసుకోవడం ఇలా వింటూ ఉంటే "ఆహా..మన తెలుగు సినిమాలకి ఈ భాగ్యం ఎపుడు కలుగుతుంది?" అని అనుకున్నాను. మన సినిమా బాక్సు ఇంచుమించు 80 పౌండ్ల బరువు ఉంటుంది. దాన్ని ఎత్తి,దించుతుంటే సినిమా చూడకుండానే సినిమా కనపడేది.


ఆనాటి కల కొన్ని నెలల ముందు "కొంచెం ఇష్టం,కొంచెం కష్టం" సినిమాతో తీరింది. అమెరికాలో డిజిటల్ ప్రింట్ తో ప్రదర్శింపబడిన మొదటి సినిమా ఇది. కాకపోతే అప్పటికి న్యూజెర్సీ,శాన్ హోసే లాంటి పెద్ద సెంటర్లలో మాత్రమే డిజిటల్ ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఆంజనేయులు సినిమాతో మా ఊర్లో కూడా డిజిటల్ సినిమాలు మొదలయ్యాయి. ఈ మధ్య వచ్చిన జోష్, బాణం కూడా డిజిటల్ సినిమాలే. ఈనాడు ఎలా వస్తుందో రేపటికి కానీ తెలియదు,ఎందుకంటే ఆ సినిమా రేపటికి కానీ విడుదల కాదు కాబట్టి. మగధీర కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి ఉంటే ఇంకొంచెం బాగుండేది.


ఈ డిజిటల్ సినిమా వల్ల లాభాలేమిటో ఇపుడు చెప్పుకుందాం.

1)సినిమా బాక్సు బరువు 80 పౌండ్ల నుండి 1/2 పౌండ్ కి తగ్గడం. నేను బాక్సులు తీసుకు వస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలిసిన మొదటి ఉపయోగం ఇదే.

2)అమెరికాకి ప్రింట్ పంపాలంటే ఇంచుమించు ఒక రోజు పడుతుంది.ఇపుడయితే రిలీజ్ ముందర ఇంటర్నెట్ నుండి డైరెక్టుగా డిజిటల్ ప్రొజెక్టర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మా ఊర్లో ఇలా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం లేదు,కాబట్టి న్యూజెర్సీలో డౌన్ లోడ్ చేసి హార్డ్ డ్రైవ్ లోకి కాపీ చేసి మాకు షిప్ చేస్తే మేము హార్డ్ డ్రైవ్ లో నుండి చూసేస్తాం.

3)సినిమాని ఫిల్మ్ లో ముద్రించేకంటే డిజిటల్ ప్రింట్ చెయ్యడం వల్ల ఖర్చు చాలా తక్కువ. ఒక ఫిల్మ్ చెయ్యాలంటే కనీసం వెయ్యి డాలర్లు ఖర్చు పెట్టాలి. సినిమాని హార్డ్ డ్రైవ్ లో కాపీ చేస్తే $50 కూడా పట్టదు.దీనివల్ల వ్యాపారంలో కొంచెం మిగులుబాటు ఉంటుంది నిర్మాతకీ,డిస్ట్రిబ్యూటర్లకీ.

4)ఇంకొక ముఖ్యమయిన ఉపయోగం ఏమిటంటే సినిమా ఆడియో ఎలాగూ డిజిటల్ లో ఉంటుంది.దాన్ని ఫిల్మ్ లోకి కన్వర్ట్ చేస్తే, సినిమా ప్లే చేసేటపుడు ఫిల్మ్ లోని ఆడియో మళ్ళీ డిజిటల్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఈ కన్వర్షన్స్ లేకుండా ఫ్రెష్ ఆడియో మనకి డిజిటల్ సినిమాలో ఉంటుంది. వీడియో కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. మొన్న ఆంజనేయులు సినిమా చూస్తే జీవా ఇంకా నల్లగా కనిపించాడు!

5)బాక్సులో సినిమా అంటే దాన్ని ప్రొజెక్టర్ కి చుట్టి వెయ్యాలి. ఈ పని చెయ్యడానికి కనీసం ఒకటిన్నర గంట పడుతుంది. ఇపుడయితే హార్డ్ డ్రైవ్ రాగానే సినిమా రెడీ.

డెట్రాయిట్లో కొకు,శ్రీశ్రీ,గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు!


సెప్టెంబరు 26,27 తేదీలలో డెట్రాయిట్ లిటరరీ క్లబ్ కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంది. రెండు రోజులు చర్చలు, ఉపన్యాసాలు, విందు భోజనాలతో చాలా సందడిగా ఉంటుంది. మీరు ఈ ఉత్సవాలలో పాల్గొంటారా? అయితే ఈ శనివారంలోగా రిజిష్టర్ చేసుకోండి.