Monday, March 28, 2016

సరసిజ థియేటర్స్ మిస్సమ్మ - రంగస్థల నాటకం





గత సంవత్సరం ఫేస్ బుక్కులో ఒక ప్రకటన చూసాను. ఒకానొక కాలంలో తెలుగునేల మీద ఒక వెలుగు వెలిగిన నాటకరంగాన్ని డాలస్ తీసుకువచ్చే ప్రయత్నం చేపట్టామని అందులో నటించడానికి నటులు కావాలని సరసిజ - The Stage వారు ప్రకటించారు. 

"నేను ఉత్సాహంగా ఉన్నానండీ" అని నా వివరాలు తెలిపాను.

పంపిన వెంటనే రాజేశ్వరి ఉదయగిరి గారు ఫోన్ చేసారు. నాతో కాసేపు మాట్లాడి, నాటకం వివరాలు త్వరలో అందజేస్తామన్నారు.


రాజేశ్వరి గారి గొంతు ప్రతి ఆదివారం యువ రేడియోలో వింటూ ఉంటాను. కొన్ని సార్లు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, నాటా, తానా కార్యక్రమాలలో ఆమెని చూడడం కూడా జరిగింది. చక్కని తెలుగు మాట్లాడుతూ అటు రేడియోలోనే కాకుండా అమెరికాలో పలు తెలుగు సంఘాల సాంస్కృతిక కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు.
   

తొందరలోనే నటీ, నటులందరం రాజేశ్వరి గారి ఇంటిలో కలిసాము. నాతో పాటూ భాస్కర్ రాయవరం గారు, శ్రీకాంత్ సముద్రాల గారు, కళ్యాణి సిద్ధార్థ గారు, బాలా కర్రి గారు, జయ కళ్యాణీ గారు, వెంకట ఫణీంద్ర సుసర్ల గారు నాటకంలో ఉన్నారని తెలిసింది. భాస్కర్ రాయవరం గారు మనబడిని నడిపిస్తూ తెలుగు భాషని పిల్లలకు నేర్పిస్తూ ఎంతో కృషి చేస్తూ ఉంటారు. భాస్కర్ గారితో కలిసి పని చెయ్యడం ఇదే మొదటిసారి. శ్రీకాంత్ IT Happens సినిమాతో మంచి నటుడిగా, దర్శకుడిగా అందరికీ పరిచయమే! కళ్యాణి సిద్ధార్థ గారు, బాలా కర్రి గారు, వెంకట ఫణీంద్ర సుసర్ల గారు కూడా మనబడిలో పిల్లలకి తెలుగు నేర్పిస్తూ ఉంటారు.జయ కళ్యాణి గారు డాలస్ వాసులకి ఆది రేడియో జాకీగా, మంచి గాయనిగా పరిచయం. రాజేశ్వరి ఉదయగిరి గారు, భాస్కర్ రాయవరం గారు, కళ్యాణి సిద్ధార్థ గారు, బాలా కర్రి గారు, జయ కళ్యాణీ గారు డాలసులో ఇంతకు మునుపు కొన్ని నాటకాలు వేసారు కూడా.  


రాజేశ్వరి గారు, జయ కళ్యాణి గారు ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరూ ఒక సాయంత్రం విజయా వారి మిస్సమ్మ సినిమా చూస్తూ తన్మయత్వం చెందుతూ ఈ నాటకాన్ని మనం డాలసులో వేస్తే ఎలా ఉంటుంది అని అలోచించించగా పుట్టినదే ఈ సరసిజ. తమ ప్రయత్నం అద్భుతమైనదే కాకుండా ఎంతో సాహసంతో కూడినదని కూడా వీరిద్దరికీ తెలుసు. అయినా ఎక్కడా తడబడకుండా, అంతులేని ఆత్మవిశ్వాసంతో నిన్న నాటకం ప్రదర్శించేవరకూ అహర్ణిశలూ వీరిద్దరూ పడిన తపన చూసి నాకు చాలా ముచ్చటేసింది. మేమందరం మిస్సమ్మ నాటకం వేస్తామని తెలియగానే ఆనందంతో నాకు కొన్ని వారాలు నిద్ర కూడా పట్టలేదు. ఇంతటి అద్భుతమైన కళాఖండాన్ని నాటకంలాగా ప్రదర్శించబోతున్నామన్న నిజం మమ్మల్నందరినీ ఉక్కిరిబిక్కిరి చేసింది.



మిస్సమ్మ సినిమా నుండి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తీసుకుని రాజేశ్వరి ఉదయగిరి గారి తల్లి గారు విజయలక్ష్మి అత్తలూరి గారు మాకు నాటకానికి కావలసిన కథ, సన్నివేశాలను అందించారు. వీటిని రాజేశ్వరి గారు, జయ గారు అమెరికాకి తగ్గట్టుగా మార్పులు చేసారు. సినిమాలో రామారావు, సావిత్రి గారు స్కూలులో టీచరుగా ఉద్యోగంలో చేరుతారు. ఆ మిస్సమ్మ అమెరికా వస్తే ఎలా ఉంటుందో, అలాగ కథని చక్కగా మలిచారు. విజయలక్ష్మి గారు ప్రముఖ రచయిత్రి. ఎన్నో కథలు, నవలలు రాసారు. కొన్ని సంవత్సరాల ముందు మా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా వచ్చారు. ఆమె రాజేశ్వరి గారి తల్లి అని తరువాత తెలిసింది. అంతే కాకుండా రాజేశ్వరి గారు చిన్నప్పటి నుండి ఆకాశవాణిలో ప్రముఖ నటులు చాట్ల శ్రీరాములు, రమణ మూర్తి లాంటి వారితో కలిసి నాటకాలలో పాల్గొన్నారట. అందుకే రాజేశ్వరి గారి నటన ఎంతో సహజంగా ఉంటుంది. సన్నివేశానికి తగ్గట్లుగా మాటలతో ప్రయోగాలు చేయడంలో అందె వేసిన చేయి. మరొక విషయమేంటంటే రాజేశ్వరి గారు జెమినీ టీవీలో కూడా పనిచేసారు. ఇప్పటి ప్రముఖ anchors అయిన సుమ, ఝాన్సీ, గాయని సునీత, అనిత, రఘు కుంచె గారితో పనిచేసారని కూడా తెలిసింది.









ఇంచుమించు డిసెంబరు నుండి ప్రతి వారాంతం కలిసి నాటకానికి తయారయ్యేవాళ్ళం. డైలాగులు ఎలా పలకాలి? భావాన్ని ఎలా ప్రదర్శించాలి? వాటి మీద రాజేశ్వరి గారు అందరికీ తగిన తర్ఫీదు ఇచ్చారు. మొదటి కొన్ని వారాలు డైలాగులు నోటికి రావడానికి సరిపోయింది. వారం మధ్యలో ఫోనులో అందరూ కలిసి డైలాగులు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మాతో పాటూ గాయత్రి కందడై న్యూజెర్సీ నుండి ఫోనులో, గూగొల్ హాంగ్ అవుట్ లో కలిసి నటించేది. కొన్ని వారాలు గడిచేసరికి అందరికీ నాటక అనుభవం చాలా సరదాగా తయారయ్యింది. నాటకం ఆడుతున్నంతసేపూ జోకులు బాగా పేలేవి. అందరూ పడీ,పడీ నవ్వే వాళ్ళం. నాటకంలో సినిమా పంచ్ డైలాగులు చెప్పడం, నాటకం అయిపోయినా ఇంకా ఆ పాత్రలాగే ప్రవర్తించడం ఇలా చాలా సరదా పంచుకున్నాం. ఇష్టమైన పని చేస్తూ ఉంటే కష్టం తెలియదన్నట్టు ఉదయం నుండీ రాత్రి వరకూ నాటకమే మాకు జీవితం అయిపోయింది.



ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఈ నాటకం గడిచిన అన్ని రోజులూ మాకు కాఫీలు, టీలు, టిఫిన్లూ, భోజనాలూ అన్నీ రాజేశ్వరి గారి ఇంట్లోనే! ఉదయాన్నే ఏదు గంటలకి వేడి, వేడిగా ఇడ్లీలూ, చట్నీలూ, సాంబార్లూ! మళ్ళీ మధ్యాహ్నం పెళ్ళి భోజనాలూ! గంట, గంటకీ కాఫీలూ, టిఫిన్లూ! రాజేశ్వరి గారి భర్త రాధేష్ పిల్లలని చూసుకుంటూ, మాకు భోజనాలు, కాఫీలు చేసేవారు. పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు! రాధేష్ గారిని చూస్తే అది నిజం అనిపించింది. పిల్లలు కూడా వారి పని వారు చేసుకుంటూ శ్రద్ధగా మా నాటకం కూడా చూసేవారు.


మిస్సమ్మ నాటకంలో సావిత్రి గారి పాత్రలో రాజేశ్వరి గారు నటిస్తుంటే జయ కళ్యాణి గారు నాటకానికి కావలసిన సాధకబాధలన్నీ చూసుకుంటూ ఉండేవారు. నాటకం వెనక వచ్చే సంగీతం, తెర మీద ఉండవలసిన దృశ్యాలు, నాటకానికి కావలసిన ప్రచారం లాంటి విషయాలన్నీ చూసుకుంటూ అందరికీ తలలో నాలుకలా ఉన్నారు. నాటకం practice కి ఎవరు రాకపోయినా వారి పాత్రని ఆమె ఎంతో అవలీలగా పోషించేవారు. మిస్సమ్మ నాటకంలో ఆమె వేయని పాత్ర లేదు! ఈ నాటకంలో జయ గారు పాల్ పాత్రకి భార్యగా నటించాలి. కానీ మా నాలుగు స్తంభాలాటలో విధి వక్రించింది. నాటకానికి సరిగ్గా రెండు వారాల ముందు జయ గారి తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోయేసరికి ఆమె కుటుంబంతో సహా హైదరాబాదు వెళ్ళవలసి వచ్చింది. జయ గారు లేని మా నాటకాన్ని ఎవరూ ఊహించలేకపోయాము. దేవుడి దయ వలన జయ గారి తండ్రి ఆరోగ్యం ఇపుడు కుదుట పడింది.

మా పాత్రలకి తగ్గ సామగ్రి కోసం చాలా చోట్ల తిరిగాము. నాకు కావలసిన గడ్డం, కళ్ళజోడు, చేతి సంచీ, రెండు రకాల టోపీలు, కిరస్తానీ తండ్రి పాత్రకి తగ్గ వేషము, బట్టలు సేకరించడానికి కొన్ని వారాలు పట్టింది. చాలా వరకు మా దగ్గర ఉన్న వాటితో నడిపించాము. కొంత సామగ్రి కొనవలసి వచ్చింది. అందరూ వారి సామగ్రి వారు తయారు చేసి పెట్టుకున్నారు. భాస్కర్ రాయవరం గారు యెస్వీ రంగారావు గారి పాత్ర పోషించాలి. ఆయన గడ్డాన్ని ప్రత్యేకంగా భారతదేశంలో తయారు చేపించారు. బాలా కర్రి గారు రమణా రెడ్డిగారి బట్టలు రెడీ చేసుకుని వాటికి సరిపోయే టోపీని తయారు చేసుకున్నారు. శ్రీకాంత్ సముద్రాల అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రకు తగ్గ డిటెక్టివ్ బట్టలు తెచ్చుకున్నారు. రాజేశ్వరి గారు కూడా సావిత్రి పాత్రకి తగ్గ విగ్గుని తయారుచేపించి తెచ్చుకున్నారు. భాస్కర్ గారు, కళ్యాణీ గారు, గాయత్రి గారు తెలుగుదనం ఉట్టిపడేలా బట్టలు, ఆభరణాలు కుదుర్చుకున్నారు. ఫణీంద్ర గారి పాత్ర అమెరికాలోని మేనేజరు కాబట్టి చక్కగా సూటూ, బూటు వేసుకున్నారు. 





మా నాటకంలో ప్రత్యేకత ఏమిటంటే నందమూరి తారకరామారావు గారి పాత్రలో ఉత్తేజ్, రేలంగి గారి పాత్రలో హరీష్ గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి రావడం! నాటకం ఒక వారం ఉందనగా ఇద్దరూ డాలస్ చేరుకున్నారు. వీరిద్దరినీ కలిసినప్పటి నుండీ మా సరదాకి ఇక అంతులేదు. వీరు దిగిన పక్క రోజు అందరం కలిసి డైలాగులు ప్రాక్టీస్ చేసాము. భోజనం పూర్తి అవగానే భోరున వర్షం, పింగ్ పాంగ్ సైజులో వడగళ్ళ వర్షం డాలసుని ముంచెత్తింది. ఉత్తేజ్ గారి నాటక రంగం, సినీ రంగంలో ప్రావీణ్యం మనందరికీ తెలిసిందే! నాటకంలో మెలకువలన్నీ నేర్పిస్తూ పాత్రలకి ఊపిరి పోసారు. హరీష్ గారు కూడా రేలంగి పాత్రలో జీవిస్తూ మమ్మల్ని బాగా నవ్వించారు. ఉత్తేజ్ గారు ప్రతి నిముషం ఒక జోకు పేలుస్తూ మమ్మల్నందరినీ నవ్వించారు.





















కళ్యాణీ గారికి ఒక సీన్ గురించి చెప్తూ ఆయన నటించి చూపించారు. ఆ నటన చూసి మా అందరి కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.










నాటకం ముందు రోజు బావర్చి బాంకెట్ హాలులో ఉదయం నుండి సాయంత్రం వరకు నటించి అందరం ఇంటికి వెళ్ళి తొందరగా పడుకున్నాము. అందరి బట్టలు, పాత్రల సామగ్రి తీసుకుని హాలుకు చేరుకున్నాము. స్టేజి మీద ఒకసారి మళ్ళీ నాటకం ప్రాక్టీస్ చేసి మైకులు తగిలించుకున్నాము. నాటకానికి స్టేజి మీద ఏమేమి ఉండాలో చూసుకోవడానికి మాకొక చాకు లాంటి కుర్రాడు దొరికాడు. అవినాష్, అతని స్నేహితులు కలిసి ఏ సీన్ కి ఏమి ఉండాలో చూసుకుంటూ నాటకానికి రక్తి కట్టించారు. నా మేనకోడలు శ్వేత కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఒక చిన్న అతిథి పాత్రని కూడా పోషించేసింది.  వెంకట ఫణీంద్ర సుసర్ల గారు, బాల గనపవరపు గారు నాటకానికి సంగీతం ఏర్పాట్లు ఎంతో ఘనంగా నిర్వహించారు. మేకప్ రూములో రంగు పూసుకుంటూ ఆ కాలంలో నాటకాలు వేసేటపుడు వారి అనుభవం ఎలా ఉందో కాసేపు ఊహించుకున్నాము. 



 మా నాటకాన్ని మద్దుకూరి చంద్రహాస్ గారు ప్రేక్షకులకు చక్కగా పరిచయం చేస్తూ సరసిజ టీముని అభినందించారు. నాటకం జరుగుతున్నంతసేపూ ప్రేక్షకులు ఎంతో నిశ్శబ్దంగా చూస్తూ మమ్మల్నెంతో అభినందించారు. మా ఆహ్వానాన్ని స్వీకరించి మా నాటకాన్ని ఆద్యంతం తిలకించిన డాలసు నగరవాసులకు, స్నేహితులకు, బంధువులకు మళ్ళీ ఒకసారి వందనాలు తెలుపుకుంటున్నాను.




ఈ నాటకంలో నాకూ ఒక పాత్ర ఇచ్చినందుకు రాజేశ్వరి గారికి ధన్యవాదాలు. గత కొన్ని నెలలుగా అందరూ ఒక కుటుంబ సభ్యులులాగ మెలిగాము. నాకయితే నాటకం మొదలయిన రోజు నుండీ ప్రతి రోజూ ఒక కొత్త పాఠం నేర్చుకున్నట్లనిపించింది. మిస్సమ్మ నాటకం ఒక మధురానుభూతిని మిగిల్చింది. నాటకం పూర్తి అయ్యాక రాజేశ్వరి గారి కళ్ళలో ఆనందం కనిపించింది. ఈ నాటకాన్ని డాలసునుండే కాక బయటివారు కూడా అంతర్జాలంలో చూడడం జరిగింది. నాటకంలో పాల్గొన్న పాత్రల కుటుంబసభ్యులు తెలుగుదేశం నుండి చూసే అవకాశం కల్పించిన హమారా టీము సురేష్ కాజా గారికి ధన్యవాదాలు. విజయవాడ నుండి మా అక్క, చెన్నై నుండి అన్నయ్య, సూళ్ళూరుపేట నుండి స్నేహితుడు ఈ నాటకం చూసారు. నాటకాలని పోషించేవారుంటే మరిన్ని ప్రదర్శనలు మన ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేవనిపించింది. అమెరికాలో, భారతదేశంలో మళ్ళీ రంగస్థలం పుంజుకునే రోజులు రావచ్చేమో అని నాకు ఆశ కూడా కలిగింది.    


3 comments:

Anonymous said...

Please post the video of the drama if you can.

శ్రీ said...

The DVD is in progress, it will be released soon.

Ramarao said...

చక్కని నాటకం వేసారు.. మీరు పడిన శ్రమ, చేసిన సాధన మాకు కళ్ళకి కట్టినట్టుగా విపులంగా వర్ణించినందుకు అభినందనలు, కృతజ్ఞతలు